'అవమానం భరించలేకపోయాం.. అందుకే రాజీనామాలు'

21 May, 2020 11:11 IST|Sakshi
జెఎస్‌ జెయ్రితా, మణిపూర్‌ భవన్‌ డిప్యూటీ రెసిడెన్సీ కమిషనర్

కోల్‌కతా : కరోనా కట్టడికి వైద్య సిబ్బంది చేస్తున్న కృషి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డాక్టర్ల తర్వాత కరోనా రోగులను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత ఆసుపత్రిలో నర్సుల పైనే ఉంటుంది. రోగులు పెట్టే ఇబ్బందులను సైతం పక్కనపెట్టి నర్సులు వారి విధులు నిర్వర్తిసుంటారు. మరి అలాంటి వారికి ఎంత కష్టం వచ్చిందో కానీ దాదాపు 300 మంది నర్సులు తమ ఉద్యోగానికి రాజీనామా సమర్పించారు. ఈ ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది.
(ఉద్యోగం పోయినా లాటరీలో కోట్లు వచ్చాయి)

ఈ విషయాన్ని కోల్‌కతాలోని మణిపూర్‌ భవన్‌ డిప్యూటీ రెసిడెన్సీ కమిషనర్‌ జెఎస్‌ జెయ్రితా వెల్లడించారు. ఇప్పటికే 185 మంది నర్సులు ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంఫాల్‌కు వెళ్లిపోయారని ఆమె తెలిపారు. ఇదే విషయమై క్రిస్టెల్లా అనే నర్సు తన భావోద్వేగాన్ని పంచుకుంది.' ఈ ఉద్యోగం వదిలిపెట్టి వెళుతున్నందుకు మేము సంతోషంగా లేము. కరోనా రోగులకు సేవ చేస్తున్న సమయంలో వారి నుంచి తాము వివక్ష, జాత్యంహంకారం ఎదుర్కొన్నాం. అప్పుడప్పుడు కరోనా రోగులు మాపై అనుచితంగా ప్రవర్తిస్తూ ఉమ్మి వేసేవారు. ఇంత కఠిన సమయంలోనూ మా విధులు నిర్వర్తించాం. మాకు సరైన పీపీఈ కిట్లు లేకపోవడంతో వారంతా మమ్మల్ని అనుమానంగా చేసేవారు. అందుకే ఉద్యోగానికి రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నాం' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కరోనా నేపథ్యంలో మణిపూర్‌కు చెందిన దాదాపు 300 మంది నర్సులను డిప్యూటేషన్‌పై కోల్‌కతాకు రప్పించారు. ఈ నేపథ్యంలో వారందరిని కరోనా పేషంట్లు చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రులకు అటాచ్‌ చేశారు.
(క‌రోనా : 40 మిలియ‌న్ డాల‌ర్ల విరాళం)

కాగా ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్‌లో 2961 కరోనా కేసులు నమోదవ్వగా, 1074 మంది డిశ్చార్జ్‌ అ‍య్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 259 మంది మృతి చెందారు. ఇక దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,12,359కి చేరింది.  కరోనా నుంచి కోలుకున్న 45,229 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా, 3,435 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 63,624 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు