సాక్షి, లక్నో: ఓ చెక్కెర కర్మాగారం నుంచి వెలువడిన విష వాయువు(టాక్సిక్) ను పీల్చి 300 మంది విధ్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని షామ్లి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. షామ్లి జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ పక్కనే ఓ చెక్కెర కర్మాగారం ఉంది. మంగళవారం ఉదయం ఆ కర్మాగారం నుంచి వెలువడిన విష గాలులు పీల్చిన విధ్యార్థులు వాంతులు, శ్వాసకోశ, కడుపు నొప్పి, వికారాలతో ఇబ్బందులు పడ్డారు. దీంతో స్కూలు యాజమాన్యం దాదాపు 300 మంది విధ్యార్థిని విధ్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు.
విషయం తెలిసిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ కర్మాగారం నుంచి వెలువడుతున్న రసాయనాలు విష పూరిత దుర్వాసన వెదజల్లుతున్నాయని, దీని కారణంగా పిల్లలు స్పృహతప్పి పడిపోయిన ఘటనలు చాలా ఉన్నాయని స్థానికులు చెప్పారు.