కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

29 Mar, 2018 02:50 IST|Sakshi

నలుగురు ఉగ్రవాదులు హతం

సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌ సమీపంలో పేలుడు పదార్థాల గుర్తింపు

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. నౌషేరా–సుందర్బనీ బెల్ట్‌ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో భద్రతా బలగాలు నలుగురు ఉగ్రవాదుల్ని హతమార్చాయి. ఈ ఉగ్రవాదులు ఐదురోజుల క్రితమే నియంత్రణరేఖ (ఎల్వోసీ) దాటి భారత్‌లోకి చొరబడినట్లు జమ్మూకశ్మీర్‌ డీజీపీ ఎస్పీ వైద్‌ తెలిపారు. ఈ చొరబాటుపై నిఘావర్గాల నుంచి పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వెంటనే ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్‌ చేపట్టాయన్నారు.

ఇందులోభాగంగా సుందర్బనీ ప్రాంతంలో అన్ని విద్యాసంస్థల్ని మూసివేయాల్సిందిగా ఆదేశించామన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారనీ, భద్రతా సిబ్బంది ఎవరూ గాయపడలేదని వెల్లడించారు. బుధవారం రాత్రి ఈ ప్రాంతంలోని భూషణ్‌కుమార్‌ శర్మ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు ఉగ్రవాదులు భోజనం వండాల్సిందిగా వారిని ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. సుందర్బనీలోని ఓ సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌ సమీపంలో పేలుడు పదార్థాలున్న 3 బ్యాగుల్ని గుర్తించామన్నారు.

మరిన్ని వార్తలు