ఐదుగురు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌

11 Feb, 2019 03:25 IST|Sakshi

మృతులు హిజ్బుల్, లష్కరే సభ్యులు

జవాన్‌ హత్యకేసులో నిందితులు  

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కుల్గామ్‌ జిల్లాలోని కెల్లెమ్‌ గ్రామంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతాబలగాలు ఐదుగురు ఉగ్రవాదుల్ని హతమార్చాయి. ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో భద్రతాబలగాలు కెల్లెమ్‌ను చుట్టుముట్టి గాలింపును ప్రారంభించాయి. బలగాల కదలికల్ని గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించారు.

ఈ సందర్భంగా భద్రతాబలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాతో పాటు హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన వసీమ్‌ అహ్మద్, అకీజ్‌ నజీర్‌ మీర్, పర్వేజ్‌ అహ్మద్‌భట్, ఇద్రీస్‌ అహ్మద్, జహీద్‌ అనే ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఓ జవాన్‌తోపాటు పౌరుడిని హత్యచేసిన కేసులో వీరంతా నిందితులని తెలిపారు. అనంతనాగ్, కుల్గామ్‌ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, భద్రతాసంస్థలపై వీరు గ్రనేడ్‌ దాడులకు పాల్పడ్డారని వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌ అనంతరం ఘటనాస్థలం నుంచి తుపాకులతో పాటు భారీఎత్తున మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు