న్యూఢిల్లీ : ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి కాన్బెర్రా యుద్ధ విమానం ప్రవేశించి నేటికి సరిగ్గా 60 ఏళ్లు. 2007లో రిటైర్మెంట్ తీసుకున్నా.. ఇప్పటికీ కాన్బెర్రా అంటే ఎయిర్ఫోర్స్ సిబ్బందికి ఎంతో అభిమానం. భారతీయ వాయుసేనలో ఇంగ్లీష్ ఎలక్ట్రిక్ కాన్బెర్రా బాంబర్ ఫ్లైట్ది మొదటి తరం అని చెప్పాలి. వాయుసేనలోకి కాన్బెర్రా 1957లో ప్రవేశించింది. మొదటగా 5 స్క్వాడ్రన్ బాంబర్ ఫ్లైట్లుగా చేరాయి. చైనా, పాకిస్తాన్లతో భారత్ చేసిన యుద్ధాల్లో వీటి సేవలు మరువలేనివి. పాకిస్తాన్ యుద్ధ విమానాలకు చిక్కకుండా ఆ దేశంపై కాన్బెర్రా జెట్లు బాంబుల వర్షం కురిపించాయి. కాంగో అంతర్యుద్ధ సమయంలోనూ ఇవి సేవలు అందించాయి. 1961 గోవా విముక్తి పోరాటంలోనూ, 1965, 1971 జరిగిన పాక్ యుద్ధంలోనూ, 1987లో శ్రీలంక ఆపరేషన్లోనూ, 1988 మాల్దీవుల పోరాటంలోనూ, చివరగా 1999 కార్గిల్ యుద్ధంలోనూ కాన్బెర్రా బాంబర్ ఫ్లైట్లు సేవలు అందించాయి. కాన్బెర్రా ఫ్లైట్లు 2007మే 11న వాయుసేన నుంచి రిటైర్ అయ్యాయి.