ఆసుపత్రిలోనే డాక్టర్ కాల్చివేత

14 May, 2016 15:58 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో డాక్టర్ ను కాల్చి చంపిన ఘటన ఆందోళను దారి తీసింది.  ఢిల్లీలోని పాలెం  ఏరియాలోని ఆయన ఆస్పత్రిలోనే డాక్టర్‌ బల్వంత్‌సింగ్(61) పై దాడి చేసిన దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. శుక్రవారం రాత్రి ఆయన హత్యకు గురైనట్లు పోలీసులు శనివారం తెలిపారు.  సింగ్ తన క్లినిక్‌లో కొన్ని మరమ్మతులు చేయించిన అనంతరం ఇంటికి బయల్దేరుతుండగా  అకస్మాత్తుగా ఓ వ్యక్తి డాక్టర్ పై దాడిచేసి అతి సమీపం నుంచి కాల్పులు జరిపి పారిపోయాడని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.


వ్యక్తిగత కక్షల కారణంగాణే ఈహత్య జరిగి ఉండొచ్చని  అనుమానిస్తున్నారు. బల్వంత్‌సింగ్ ఇటీవల తన ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేసిన నేపథ్యంలో భారీ అప్పుల్లో కూరుకుపోయినట్టు తెలుస్తోందన్నారు.  మరోవైపు బల్వంత్ సింగ్ కు ఒక   కుమారుడున్నప్పటికీ ఆర్థికంగా అతడి నుంచి ఎలాంటి ఆసరా లేదని, కుటుంబం మొత్తంలో ఆయన ఒక్కరే సంపాదిస్తున్నారని పోలీసులు తెలిపారు.

అయితే బల్వంత్‌సింగ్ కు  తన సోదరులతో ఆస్తి పంపకాల విషయమై వివాదాలు ఉన్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు.  హత్యకేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.  విచారణ జరుపుతున్నామని డీసీపీ సురేంద్ర కుమార్  తెలిపారు.

>
మరిన్ని వార్తలు