తీరప్రాంత గస్తీకి సుస్తీ!

29 Jun, 2014 22:17 IST|Sakshi

మరమ్మతులకు నోచుకోక తీరానికే పరిమితమవుతున్న నౌకలు
సాక్షి, ముంబై: 26/11 సంఘటన తర్వాత తీరప్రాంత గస్తీని మరింత పటిష్టం చేస్తామంటూ గొప్పలు చెప్పుకున్న నేతలు, అధికారులు ఇప్పుడు ఆ విషయాన్నే మర్చిపోయారు. సముద్ర తీరాల భద్రత కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన గస్తీ నౌకలు మరమ్మతులకు నోచుకోలేక తీరానికే పరిమితమవుతున్నాయి. మరికొన్ని రోజులు అవి తీరంలోనే ఉంటే పూర్తిగా శిథిలావస్థకే చేరే అవకాశముం దని పలువురు హెచ్చరిస్తున్నారు. హోంశాఖ కూడా వీటిపై దృష్టి పెట్టడం లేదని, 26/11 సంఘటన పునరావృతమయ్యే ప్రమాదం ఉందంటున్నారు.

పరిపాలన విభాగం నిర్లక్ష్యంవల్ల జరుగుతున్న ఈ నిర్వాకంతో తగినన్ని నౌకలు అందుబాటులో లేక తీరప్రాంతాల్లో పూర్తిస్థాయిలో గస్తీ నిర్వహించలేకపోతున్నారు. 2008, నవంబర్ 26న ఉగ్రవాదులు నగరంలోకి చొరబడి మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. సముద్ర మార్గం మీదుగా కుబేర్ పడవలో నగరంలో చొరబడిన 10 మంది ఉగ్రవాదులు వంద మందికిపైగా నగరవాసులను పొట్టనబెట్టుకున్నారు. దీంతో తీరప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సదుపాయాలున్న గస్తీ నౌకలను కొనుగోలు చేసిం ది. రాష్ట్రంలో 570 కి.మీ. సముద్ర తీర ప్రాంతం విస్తరించి ఉంది. అందులో దేశ ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న ముంబైకి 114 కి.మీ. తీర ప్రాం తం ఉంది. తీర ప్రాంతాలకు ఆనుకొని ఉన్న ఆరు జిల్లాల్లో కొత్తగా 12 పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశా రు. ప్రస్తుతం తీరప్రాంతాల్లో మొత్తం 37 పోలీసు స్టేషన్లు ఉన్నాయి.

కోస్టు గార్డు అధీనంలో దాదాపు 91 గస్తీ నౌకలు ఉన్నాయి. ఇవి తీర ప్రాంతాల వెం బడి ప్రతీరోజు సుమారు మూడు వేలకుపైగా ట్రిప్పులు కొడతాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వా నికి చెందిన 12, 5 టన్నులు ఇలా వేర్వేరుగా 24 గస్తీ నౌకలు ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చూసుకుం టున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి 12 మీటర్ల పొడవున్న నౌకలు ఏడు, 9.5 మీటర్ల పొడవున్న 22 నౌకలు ఉండగా వీటి నిర్వాహణ బాధ్యతలు మెరైన్ ప్రంటియర్స్ కంపెనీకి అప్పగించారు.

ఈ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం మే 16న ముగి సింది. ఇంతవరకు గడువు పెంచకపోవడంతో గస్తీ నౌకలకు మరమ్మతులు జరగడం లేదు. ఫలితంగా 19 నౌకలు ఒడ్డుకే పరిమితమయ్యాయి. ఒడ్డున పడి ఉన్న నౌకలకు స్టార్టింగ్ ట్రబుల్, కొన్నింటికి గేర్ బాక్స్, ఇంజిన్ అయిల్ లీకేజీ తదితర సమస్యలున్నాయి. గడువు పొడిగిస్తేనే ఇవి మరమ్మతులకు నోచుకుంటాయని, తీరప్రాంత భద్రత పటిష్టమవుతుందన్నారు.

మరిన్ని వార్తలు