రైళ్లలో ఇక ఆ ఇబ్బంది ఉండదు..!

25 Apr, 2019 16:48 IST|Sakshi

న్యూఢిల్లీ : సరదాగా సాగిపోతున్న రైలు ప్రయాణంలో ఒక రకమైన బెరుకు, ఇలా చేస్తున్నారేంటి..? అనే భావనను కలిగించే ట్రాన్స్‌జెండర్లపై రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ప్రయాణికులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న హిజ్రాలపై కొరడా ఝళిపించింది. గత నాలుగేళ్ల కాలంలో దాదాపు 73 వేల మందిని అరెస్టు చేసింది. రైళ్లలో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న హిజ్రాలపై రైల్వే శాఖ చేపట్టిన చర్యలేంటో తెలపాలని దాఖలైన ఆర్టీఐ పిటిషన్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. గత ఏడాది కాలంలోనే 20 వేల మంది ట్రాన్స్‌జెండర్లు అరెస్టు కాగా, ఈ జనవరిలోనే 1399 మందిని అరెస్టు చేసినట్టు రైల్వే శాఖ వెల్లడించింది.

2015 జనవరి నుంచి హిజ్రాల డబ్బు వసూళ్ల పై చర్యలు ముమ్మరం చేశామని తెలిపింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రైల్వే భద్రతా దళం ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తోందని తెలిపింది. ఇదిలాఉండగా.. రైల్వే శాఖ చర్యలతో నకిలీ ట్రాన్స్‌జెండర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడిందని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా పనిచేసుకుని బతికే బదులు తమకు ప్రత్యేక హక్కులున్నట్టుగా వ్యవహరించే వారికి తగిన బుద్ధి చెప్పినట్టయిందని అంటున్నారు. యాచించడం బదులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేయడం, ఎదురు తిరిగితే అసభ్యంగా ప్రవర్తించడం నకిలీ హిజ్రాలకు అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు