ఆకలి చావులకు కారణం అదే..

22 Feb, 2020 15:37 IST|Sakshi
అభిజిత్‌ బెనర్జీ (ఫైల్‌)

జార్ఖండ్‌లో తొలగించిన రేషన్‌ కార్డుల్లో 90 శాతం నిజమైనవే

రాంచీ: జార్ఖండ్‌లో మూడేళ్ల క్రితం తొలగించిన రేషన్‌ కార్డుల్లో 90 శాతం కార్డులు నిజమైనవేనని తేలింది. ఈ మేరకు జార్ఖండ్‌లోని 10 జిల్లాల్లో జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనాన్ని 2019 నోబెల్‌ బహుమతి విజేత అభిజిత్‌ బెనర్జీకి చెందిన అబ్దుల్‌ లతీఫ్‌ పావర్టీ యాక్షన్‌ ల్యాబ్‌ (జే–పాల్‌) చేసింది. 4 వేల రేషన్‌ కార్డులను వీరు పరిశీలించగా అందులో కేవలం 10 శాతం మాత్రమే ఎవరివో గుర్తించలేకపోయారు. కానీ అప్పటి ప్రభుత్వం మాత్రం చాలా వరకు కార్డులు నకిలీవని పేర్కొందని ఈ అధ్యయనం తెలిపింది. ఈ రేషన్‌ కార్డులను తొలగించడం ఆకలి చావులకు కారణమని ఆ అధ్యయనం పేర్కొంది. 2007 సెప్టెంబర్‌లో సిండెగ జిల్లాలో ఆకలికి అలమటించి చనిపోయిన 11 ఏళ్ల సంతోషి కుమారి అనే బాలికను ఉదాహరణగా చెప్పింది. (చదవండి: నిన్న అమూల్య.. నేడు ఆర్ధ్ర)

ఆధార్‌ కార్డుతో లింక్‌ చేయనందున సంతోషి వాళ్ల రేషన్‌ కార్డును అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. కానీ ఆకలితో ఎవరూ చనిపోలేదని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అధ్యయనం నిర్వహించిన 10 జిల్లాల్లో 2016 నుంచి 2018 మధ్య 1.44 లక్షల రేషన్‌ కార్డులను ప్రభుత్వం రద్దు చేసింది. అది ఆ జిల్లాల్లోని మొత్తం రేషన్‌ కార్డుల్లో 6 శాతమని అధ్యయనంలో తేలింది. రద్దైన కార్డుల్లో 56 శాతం ఆధార్‌తో లింక్‌ కానివని, ఇది మొత్తం రేషన్‌ కార్డుల్లో 9 శాతం అని తెలిపింది. డూప్లికేట్‌ కార్డులను తొలగించడానికి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని, ఎవరైనా అసలైన లబ్ధిదారులకు కార్డులు లేనట్లు తేలితే వారిని రేషన్‌ కార్డు జాబితాలో చేరుస్తామని జార్ఖండ్‌ ప్రణాళిక, ఆర్థిక, ఆహార, వినియోగదారుల సంబంధాల మంత్రి రామేశ్వర్‌ ఒరావున్‌ పేర్కొన్నారు.  (చదవండి: రాధిక కథ సినిమా తీయొచ్చు)

>
మరిన్ని వార్తలు