ప్రాణం పోతున్నా..

12 Dec, 2016 14:57 IST|Sakshi
ప్రాణం పోతున్నా..

కోల్‌కతా: పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరుతున్నారు. సాధారణ అవసరాలకు సైతం చేతిలో డబ్బు అందుబాటులో లేకపోవడంతో సామాన్యుల సమయం గంటల కొద్ది క్యూ లైన్లలోనే గడిచిపోతుంది.

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో ఏటీఎం క్యూ లైన్లో నిలుచున్న ఓ 52 ఏళ్ల వ్యక్తి అక్కడే కుప్పకూలాడు. చాలా సమయం లైన్లో నిలుచున్న అతడికి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. బాధతో విలవిలలాడుతున్నా అతడితో పాటు లైన్లో ఉన్నవాళ్లు చూసీచూడనట్లుగా వదిలేసి.. డబ్బుకోసం ముందుకు కదిలారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

దేశంలోని 80 శాతం ఏటీఎంలలో కొత్త నోట్లు ఉంచడానికి అవసరమైన మార్పులు చేశాం అని అధికారులు చెబుతున్నప్పటికీ కరెన్సీ కష్టాలు మాత్రం తీరడం లేదు. ఎక్కడ చూసినా మూసివేసిన, నో క్యాష్ బోర్డులు ఉంచిన ఏటీఎంలే కనిపిస్తున్నాయి. డబ్బు ఉన్న కొద్దిపాటి ఏటీఎంల వద్ద క్యూ లైన్లలో వృద్ధులు, మహిళలు నానా అవస్థలు పడుతున్నారు.
 

మరిన్ని వార్తలు