కుల పెద్దల తీర్పుతో వివాహిత ఆత్మహత్య

16 Mar, 2016 12:47 IST|Sakshi

భోపాల్: వివాహేతర సంబంధం అంటగట్టారని మనోవేదనకు గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని టికామ్ గఢ్ లో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... టికామ్ గఢ్ జిల్లాలోని బజారువా ఖారి గ్రామంలో ఓ వివాహిత(36), భర్త రాకేష్, తన నలుగురు పిల్లలతో కలిసి ఉంటోంది. మూడు రోజుల కిందట భర్త రాకేష్ స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటుండగా అతడి భార్య ఓ దళితవ్యక్తితో సన్నిహితంగా గడిపిందని వారి కులపెద్దలు ఆరోపించారు. ఈ విషయాన్ని కుల పెద్దల పంచాయతీ దృష్టికి తీసుకెళ్లారు.

పంచాయతీ పెద్దలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. భర్తతో కలిసి పనిచేసే ఓ దళిత యువకుడితో ఆమె శారీరక సంబంధాలు పెట్టుకుందని కొందరు వ్యక్తులు సాక్ష్యం చెప్పారు. దళితుడితో సంబంధాలు పెట్టుకున్నావని ఆమెను కొందరు పెద్దలు మందలించారు. రూ.5 వేలు జరిమానా కట్టాలని,  ఆ వివాహిత గంగా నదిలో స్నానం ఆచరించాలని, 30 మందికి పైగా మందు పార్టీ ఇవ్వాలని తీర్పు ఇచ్చారు. ఇంతటితో ఆగకుండా సమీపంలోని గ్రామంలో ఉండే శివాలయం వరకు పొర్లుదండాలు పెడుతూ వెళితేనే ఆమె తప్పును క్షమిస్తామని పెద్దలు తీర్పిచ్చారు. గ్రామంలో జరిగిన పెళ్లికి తమను ఎందుకు ఆహ్వానించలేదని అడిగిన నేపథ్యంలో ఆ వివాహిత కుటుంబంపై ఆ కుల పెద్దలు ఇలాంటి దారుణ తీర్పును ఇచ్చారు.

మరిన్ని వార్తలు