హెయిర్‌కట్‌కు ఆధార్‌ తప్పనిసరి!

2 Jun, 2020 14:51 IST|Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కేసుల సంఖ్య మాత్రం అదుపులోకి రావడంలో లేదు. ఈ క్రమంలోనే కంటైన్‌మెంట్‌ జోన్లో లాక్‌డౌన్‌ను జూన్‌ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే క్రమంలో పలు దుకాణాలకు ఆంక్షల నుంచి సడలింపులు సైతం ఇచ్చింది. దీనిలో భాగంగానే రెండు నెలలుగా మూతబడ్డ సెలూన్‌ (కటింగ్‌) షాపులు కూడా తెరుచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో సెలూన్ల ద్వారా వైరస్‌ సోకినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై సెలూన్లుకు వచ్చే వారికి ఆధార్‌ కార్డు తప్పినిసరి చేసింది. (కరోనా: రికార్డు స్థాయిలో కేసులు)

చెన్నైలో హెయిర్‌కట్‌‌ చేయించుకోవాలి అనుకునే వారు మాస్క్‌తో పాటు ఆధార్‌ కార్డు జిరాక్స్‌ వెంట తెచ్చుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించింది. దీనిపై వివరణ కూడా ఇచ్చింది. సెలూన్ల ద్వారా ఎవరికైనా వైరస్‌ వ్యాప్తి చెందితే ఆ షాపుకు వచ్చిన వారిని గుర్తించడం అధికారులకు సులభం అవుతుందని వివరించింది. ఆధార్‌ వివరాల ద్వారా వ్యక్తులను వెంటనే గుర్తించి.. వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రభుత్వ తెలిపింది. అలాగే ప్రభుత్వ ఆదేశాలను పాటించిన షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఉత్తర్వులో పేర్కొంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 23వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన విషయం తెలిసిందే. కరోనా కేసులు అత్యధికంగా నమోదైన మహారాష్ట్ర తరువాత తమిళనాడు రెండో స్థానంలో ఉంది.

మరిన్ని వార్తలు