ఓటర్ల జాబితా–ఆధార్‌ లింక్‌పై అభ్యంతరం లేదు

6 Oct, 2018 03:50 IST|Sakshi

చెన్నై: బోగస్‌ ఓట్లను ఏరివేసేందుకు వీలుగా ఓటర్‌కార్డుతో పాటు ఓటర్ల జాబితాను ఆధార్‌తో అనుసంధానించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్నికల కమిషన్‌(ఈసీ) మద్రాస్‌ హైకోర్టుకు తెలిపింది. ఇటీవల ఆధార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకుని దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. అలాగే ఆధార్‌–ఓటర్‌ కార్డు అనుసంధానం వల్లే పెరిగే వ్యయాలను కూడా పరిశీలించాల్సి ఉంటుందని జస్టిస్‌ ఎస్‌.మణికుమార్, జస్టిస్‌ పి.టి.ఆశాల ధర్మాసనానికి విన్నవించింది. బోగస్‌ ఓట్లను ఏరివేసేందుకు ఓటర్‌కార్డు–ఆధార్‌ అనుసంధానం చేపట్టాలని ఎం.ఎల్‌.రవి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీన్ని శుక్రవారం విచారించిన ధర్మాసనం.. స్వయంగా యూఐడీఏఐ, కేంద్ర న్యాయ, హోంమంత్రిత్వ శాఖలను ఈ కేసులో ఇంప్లీడ్‌ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు