న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో సంచలనానికి తెరలేపింది. ఇప్పటి వరకూ ఉన్న పేమెంట్ విధానాలకు వినూత్నంగా మరో పేమెంట్ వ్యవస్థను రూపొందించబోతోంది. భీమ్ యాప్ ఆవిష్కరణలో ప్రధాని మోదీ ఆధార్ ఆధారిత పేమెంట్ వ్యవస్థ రాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
అంటే మన ఆధార్ సంఖ్యతో లావాదేవీలు నిర్వహించవచ్చు. కేవలం వేలిముద్రల ఆధారంగా ట్రాన్సక్షన్స్ చేయవచ్చు. ఆధార్ ఆధారిత చెల్లింపులకు స్మార్ట్ఫోన్, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు. మన ఆధారకార్డు నంబరు తో బ్యాంకు ఖాతా లింక్ అయిఉంటే చాలు.. ఆటోమేటిక్ గా లావాదేవీలు నిర్వహించవచ్చు. ప్రస్తుతానికి ఎస్బీఐ, సిండికేట్ బ్యాంక్, ఐసీఐసీఐ లాంటి ప్రముఖ సంస్థలు సపోర్టు చేయనున్నాయి. మార్చి 31 నాటికి అన్ని బ్యాంకులు ఆధార్ ఆధారిత పేమెంట్ వ్యవస్థని సపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. మరో వారం రోజుల్లో ఈ వ్యవస్థ కార్యరూపం దాల్చనుంది.