మోదీ విందులో అమీర్ ఖాన్

16 Feb, 2016 16:54 IST|Sakshi
మోదీ విందులో అమీర్ ఖాన్

న్యూఢిల్లీ: మేకిన్ ఇండియా వీక్ వారోత్సవాల్లో భాగంగా ప్రధానమంత్రి ఇచ్చిన ప్రత్యేకవిందుకు బాలీవుడ్ స్టార్లు అమీర్ ఖాన్, కంగనా రనౌత్ హాజరుకావడం ఆసక్తికరంగా మారింది. దేశ విదేశాలకు చెందిన రాజకీయ నేతలు, వివిధరంగాల సెలబ్రిటీలను ఆహ్వానించిన ఈ డిన్నర్‌కు ఇటీవల వివాదంలో ఇరుక్కున్న అమీర్ ఖాన్‌ను ఆహ్వానించడం చర్చకు దారితీసింది. తమ సర్కారును ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేసిన అమీర్, కంగనాలకు ఆహ్వానం అందటం, మోదీ ఆహ్వానాన్ని మన్నించి ఇద్దరూ విందుకు హాజరుకావడం పలువురి దృష్టిని ఆకర్షించింది.

మేకిన్ ఇండియా వీక్ వారోత్సవాల నిర్వహణలో భాగంగా శనివారం రాత్రి ప్రధాని మోదీ ఇచ్చిన ప్రత్యేక విందుకు పలువురు అంతర్జాతీయ, జాతీయ ప్రముఖుల్ని  హాజరయ్యారు. ప్రధాని ఆహ్వానం అందుకున్న అమీర్, కంగనా కూడా ఈ  విందులో పాల్గొన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా (ఎంఐఐ) వీక్‌ ప్రారంభోత్సవ అనంతరం జరిగిన ఈ కీలకమైన కార్యక్రమానికి మీడియాను అనుమతించకపోవడం గమనార్హం.

దేశంలో అసహనం  గూర్చి వ్యాఖ్యానించిన అమీర్ ఖాన్ తీవ్ర విమర్శల పాలయ్యారు. దేశం విడిచి వెళ్లిపోవాలని తన భార్య భావిస్తోందన్న అమీర్ వ్యాఖ్యలతో దేశంలో దుమారం రేగింది. చాలామంది బాలీవుడ్ నటీనటులు, ఇతర ప్రముఖులు దీనిపై భిన్నస్వరాలను వినిపించారు. ఈ క్రమంలో భావప్రకటన స్వేచ్ఛ నటులతో సహా అందరికీ ఉండాలని కంగనా వ్యాఖ్యానించారు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. ఈ వివాదం వల్ల అమీర్ ఖాన్ చాలావరకు నష్టపోయారు. పలు కంపెనీలు ఆయనను తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఒప్పందాలను రద్దు చేశాయి. భారత ప్రభుత్వం అయితే ఆయన చేస్తున్నఇంక్రెడిబుల్ ఇండియా ప్రచారం నుంచి తొలగించింది.

మరిన్ని వార్తలు