సీఎం ప్రమాణ స్వీకారం.. 50 మంది అతిథులు వాళ్లే..!

15 Feb, 2020 15:17 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయ ఢంకా మోగించిన ఆమ్‌ ఆద్మీపార్టీ (సామాన్యూడి పార్టీ) తన పేరుకు తగ్గట్టే అడుగులు వేస్తోంది. ఆదివారం జరుగబోయే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 50 మంది సాధారణ పౌరులను ముఖ్య అతిథులుగా ఆప్‌ ఆహ్వానించిందని ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా శనివారం మీడియాతో తెలిపారు. ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌, రాజకీయ ప్రముఖులు, అధికార యంత్రాగానికి చెందిన ఉన్నతాధికారులతో పాటు.. పారిశుద్ధ్య కార్మికులు, ఆటో, అంబులెన్స్‌, మెట్రో రైల్‌ డ్రైవర్లు, పాఠశాల ప్యూన్‌లు వేదిక పంచుకోనున్నారు.

ఇక రామ్‌లీలా మైదానంలో జరిగే అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రజలను ఆప్‌ ఇప్పటికే కోరింది. మాస్కో ఒలింపియాడ్‌లో పతకాలు సాధించిన విద్యార్థులు, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక దళ సిబ్బంది కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా కార్యక్రమానికి ఆహ్వానించినట్టుగా సిసోడియా తెలిపారు. కాగా, మొత్తం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ 62 సీట్లలో బీజేపీ 8 సీట్లలో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు