అభినందన్‌కు పూర్తయిన డీబ్రీఫింగ్‌ సెషన్‌

14 Mar, 2019 16:53 IST|Sakshi

న్యూఢిల్లీ : పాక్‌ చెర నుంచి విడుదలైన భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు డీబ్రీఫింగ్‌ సెషన్‌(తీవ్రమైన ఒత్తిడికి గురైన సైనికుడికి నిర్వహించే వైద్య పరీక్షలు. వీటిలో ముఖ్యంగా సైనికుడి మానసిక పరిస్థితులను విశ్లేషిస్తారు.) పూర్తయింది. కొంతకాలం పాటు అభినందన్‌ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆర్మీ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల బృందం ఆధ్వర్యంలో  ఆయనకు గత కొద్దికాలంగా వైద్యపరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే.

...కొద్దిరోజుల క్రితం సర్జికల్‌ స్ట్రైక్స్‌తో ఉలిక్కిపడ్డ పాకిస్తాన్‌ భారత్‌పై వైమానిక దాడులకు దిగింది. పాక్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) దాటి భారత గగనతలంలోకి ప్రవేశించగా.. అభినందన్‌ వర్ధమాన్‌ ఆర్‌-73 అనే మిస్సైల్‌ ప్రయోగించి ఓ యుద్ధవిమానాన్ని కూల్చేశారు. అదే సమయంలో అభినందన్‌ విమానం కూడా ప్రత్యర్థి దాడిలో నేలకూలింది.

దాంతో ఆయన ప్యారాచూట్‌ సాయంతో పాక్‌ భూభాగంలో దిగాల్సి వచ్చింది. అప్పుడు కొందరు పాకిస్తాన్‌ ప్రజలు ఆయనపై దాడి చేశారు. ఈ దాడిలో అభినందన్‌ ప్రక్కటెముకతో పాటు పలుచోట్ల గాయాలయ్యాయి. కొద్ది సేపటి తర్వాత పాక్‌ ఆర్మీ ఆయన్ని వారినుంచి రక్షించి యుద్ధ ఖైదీగా వెంట తీసుకెళ్లింది. అలా పాకిస్తాన్‌ ఆర్మీ చెరలో 60 గంటల పాటు ఉన్న అభినందన్‌ ఆ తర్వాత భారత్‌కు తిరిగొచ్చారు.

చదవండి : మానసికంగా వేధించారు

మరిన్ని వార్తలు