నిషేధిత వృత్తిలోనే మూడు లక్షల మంది!

24 Jun, 2015 18:21 IST|Sakshi
నిషేధిత వృత్తిలోనే మూడు లక్షల మంది!

న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మాన్యువల్ స్కావెంజర్ (పాకీ) వృత్తిలో ఇప్పటికీ మూడు లక్షల మంది కొనసాగుతూనే ఉన్నారని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ తెలిపారు. చట్టం చేసినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఈ విధానం అమలవుతూ ఉండటాన్ని గర్హిస్తున్నామని, ఆ వృత్తిలో కొనసాగుతున్నవారి వివరాలు తెలపాలని ఆయా రాష్ట్రాలను కోరినట్లు మంత్రి చెప్పారు.

2011 జనగణనలో దేశవ్యాప్తంగా 26 లక్షల బహిరంగ మలవిసర్జన కేంద్రాలు ఉన్నట్లు నమోదయిందని, ఆ గణంకాల ఆధారంగా రమారమి మూడు లక్షల మంది ఇకా ఈ వృత్తిలోనే ఉన్నారని అర్ధమవుతుందని పేర్కొన్నారు. వివరాలు సేకరించిన అనంతరం వారికి పునరావసం కల్పిస్తామన్నారు. బుధవారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

ఈ వృత్తి అత్యంత దారుణమైనదిగా భావించిన కోర్టు ఆ విధానాన్ని రద్దుచేయాలని ఆదేశించడంతో 2013 డిసెంబర్ లో కేంద్ర ప్రభుత్వం 'పాకీ పని రద్దు, వారికి పునరావాసం' చట్టాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు