ఎయిర్‌ షోలో జెట్‌ విమానాల ఢీ

20 Feb, 2019 00:58 IST|Sakshi

బెంగళూరు ఎయిర్‌షో సన్నాహకాల్లో అపశ్రుతి 

సాక్షి, బెంగళూరు: భారత వాయుసేనలో వైమానిక విన్యాసాల బృందానికి చెందిన రెండు జెట్‌ విమానాలు గాల్లో ఢీకొని కుప్పకులాయి. బెంగళూరు దగ్గర్లోని యలహంక వైమానిక స్థావరంలో ‘ఎయిరో ఇండియా షో’ వైమానిక ప్రదర్శన నేడు ప్రారంభంకానుంది. షో రిహార్సల్స్‌లో భాగంగా మం గళవారం ఉదయం సూర్యకిరణ్‌ ఎరోబాటిక్‌ టీం జెట్‌ విమానాలు విన్యాసాలు చేస్తున్నాయి. తలకిందులుగా ప్రయాణిస్తున్న ఒక జెట్‌ విమానం.. మరో విమానం మీద నుంచి వెళ్తూ విన్యాసం చేస్తోంది. తలకిందులుగా వెళ్తున్న విమానం ఒక్కసారిగా అదుపుతప్పి కిందనున్న విమానం వెనుకభాగంపై పడింది.

దీంతో రెండు విమానాలూ అదుపుతప్పి వాయువేగంతో నేలను ఢీకొని మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో సాహిల్‌ గాంధీ అనే పైలట్‌ ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు పైలట్లు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, వీరిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వీరిని వెంటనే మరో విమానంలో బెంగళూరులోని ఎయిర్‌ఫోర్స్‌ కమాండ్‌ ఆస్పత్రికి తరలించారు. రెండు విమానాలు యలహంక ఎయిర్‌బేస్‌ సమీపంలోని ఘంటిగా నహళ్లి గ్రామంలో పడ్డాయి. జెట్‌ విమానాల శిథిలాలు అదృష్టవశాత్తు ఇళ్ల మధ్య ఖాళీ స్థలంలో పడటంతో అక్కడి స్థానికులెవరూ గాయపడలేదు.  

మరిన్ని వార్తలు