గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు : 8 రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి నిందితులు

13 Jul, 2020 18:14 IST|Sakshi

విజయన్‌ సర్కార్‌పై విపక్షాల ఫైర్‌

తిరువనంతపురం : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో ఇద్దరు కీలక నిందితులను ప్రత్యేక న్యాయస్ధానం సోమవారం 8 రోజుల పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కస్టడీకి తరలించింది. ఈ కేసులో శనివారం బెంగళూర్‌లో అరెస్ట్‌ అయిన స్వప్నా సురేష్‌, సందీప్‌ నాయర్‌లను దర్యాప్తు ఏజెన్సీ అభ్యర్థన మేరకు ఎన్‌ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించింది. కాగా తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌కు చెందిన పార్మిల్‌లో 15 వేల కోట్ల రూపాయల విలువైన 30 కిలోల బంగారాన్ని జూలై 4న విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.  

కాన్సులేట్‌కు సంబంధించిన పార్శిల్లో భారీగా బంగారం పట్టుబడటం కేరళలో కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్ ఆరోపణలు ఎదుర్కోవడంతో వీరిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వ పెద్దల అండతోనే ఈ నిర్వాకం సాగిందని, తక్షణమే సీఎం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.  సీఎం కార్యాలయం నేర కార్యకలాపాలకు అడ్డాగా మారిందని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల ఆరోపించారు. గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసుపై సీబీఐచే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. చదవండి : గోల్డ్‌ స్మగ్లింగ్‌: ఎవరీ స్వప్న సురేశ్‌? 

మరిన్ని వార్తలు