సీఏఏను వ్యతిరేకించండి : బాలీవుడ్‌ ప్రముఖ నటి

23 Jan, 2020 20:07 IST|Sakshi

జైపూర్‌ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా సాగుతున్న నిరసన జాబితాలో మరో ప్రముఖ నటి చేరారు. ప్రజా వ్యతిరేకమైన సీఏఏను స్వాగతించేది లేదంటూ ప్రముఖ బాలీవుడ్‌ నటి, దర్మకురాలు నందితా దాస్‌ స్పష్టం చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, సామాన్య ప్రజల పోరాటాన్ని ఆమె ప్రశంసించారు. వివిదాస్పద చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు, ఆందోళనల్లో ఎలాంటి రాజకీయ పార్టీలు పాల్గొనడంలేదని, పోరాటాలు స్వచ్ఛందంగా జరుగుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. గురువారం జైపూర్‌లో జరిగిన లిటరేచర్ ఫెస్టివల్ (జెఎల్ఎఫ్)లో నందితా దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా షాహీన్ బాగ్ వంటి మరిన్నో ప్రదేశాలు ఏర్పడబోతున్నాయని ఆమె జోస్యం చెప్పారు.

నాలుగు తరాలుగా షాహీన్ బాగ్‌లో నివసిస్తున్న వారిని భారతీయులిగా నిరూపించుకోవాలిని కేంద్ర ప్రభుత్వం కోరాడం సరికాదన్నారు. ఇది చాలా విచారకరమని,దీనిపై ప్రతి ఒక్కరు మాట్లాడాలని, వాస్తవాలు తెలియజేసి పౌరులను ఆందోళనల్లో భాగస్వామ్యం చేయాలని నందితా పిలుపునిచ్చారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీల రద్దుపై జరుగుతున్న ఉద్యమాలు విద్యార్థులు, సామాన్య ప్రజలు నడిపిస్తున్నారని, యువత చేస్తున్న పోరాటం అభినందనీయం అన్నారు. షాహీన్ బాగ్ పోరాటం దేశంలోని ప్రతి మూలకు చేరుకోవాలని, మిగతా ప్రాంతాలు కూడా షాహీన్ బాగ్ మాదిరిగా అవ్వాలని ఆమె ఆకాంక్షించారు.

అలాగే దేశ ఆర్థిక సంక్షోభంపై కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక మందగమనం, నిరుద్యోగ సమస్యతో దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోందని  ఆందోళన చెందారు. ఈ రకమైన నిరుద్యోగాన్ని ఎప్పుడూ చూడలేదని, ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోందని ఆమె వాపోయారు.  సినీ పెద్దలు దీనిపై స్పందించాలని ఆమె కోరారు.

మరిన్ని వార్తలు