బాలీవుడ్‌ నటి అరెస్ట్‌

15 Dec, 2019 18:58 IST|Sakshi

అహ్మదాబాద్‌ : దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన బాలీవుడ్‌ నటి పాయల్‌ రోహత్గీని రాజస్ధాన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నెహ్రూ తండ్రి మోతీలాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ ఇతర కుటుంబ సభ్యులపై అభ్యంతరకర కంటెంట్‌ను పోస్ట్‌ చేసిన పాయల్‌పై అక్టోబర్‌ 10న బుండీ పోలీసులు నటిపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని పాయల్‌కు రాజస్ధాన్‌ పోలీసులు ఇటీవల ఆమెకు నోటీసులు జారీ చేశారు.

గూగుల్‌ నుంచి సేకరించిన సమాచారంతో తాను చేసిన పోస్ట్‌పై తనను రాజస్ధాన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారని ఇక భావప్రకటనా స్వేచ్ఛ జోక్‌గా మారిందని పాయల్‌ ట్వీట్‌ చేశారు. పాయల్‌ రోహత్గీని అహ్మదాబాద్‌లోని ఆమె నివాసం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని విచారణ నిమిత్తం ఆమెను బుండీకి తీసుకువస్తామని ఎస్పీ మమతా గుప్తా వెల్లడించారు. ఇక పాయల్‌ ముందస్తు బెయిల్‌పై సోమవారం కోర్టు విచారణ చేపట్టనుంది. కాగా గాంధీ కుటుంబ సభ్యుల నుంచి తనపై చర్యలు చేపట్టాలని కోరుతూ రాజస్ధాన్‌ సీఎంపై ఒత్తిళ్లు వస్తున్నాయని ఇటీవల నటి పాయల్‌ ఆరోపించారు.

మరిన్ని వార్తలు