కోర్టులో లొంగిపోయిన రాఖీ యాదవ్

29 Oct, 2016 12:46 IST|Sakshi

పట్నా: టీనేజ్ యువకుడి హత్య కేసులో నిందితుడు రాకేశ్ రంజన్ అలియాస్ రాఖీ యాదవ్ శనివారం ఉదయం గయా సివిల్ కోర్టులో లొంగిపోయాడు. కాగా రాఖీ యాదవ్కు బెయిల్ మంజూరు చేస్తూ బిహార్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించిన విషయం తెలిసిందే. దీంతో రాఖీ యాదవ్ లొంగిపోవడంతో అతడికి న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కుమారుడితో పాటు బహిష్కృత జేడీయూ ఎమ్మెల్సీ మనోరమా దేవి, ఆమె భర్త కూడా కోర్టుకు వచ్చారు.  

ఈ ఏడాది మే నెలలో తన కారును ఓవర్‌ టేక్‌ చేసినందుకు నడిరోడ్డుపై ఆదిత్య సచ్‌దేవ్‌ అనే యువకుడిని రాఖీ యాదవ్‌ కాల్చి చంపిన విషయం తెలిసిందే. అనంతరం పరారీలో ఉన్న అతడిని  అదే నెల 11న పోలీసులు అరెస్ట్ చేయగా, పట్నా హైకోర్టు ఈ నెల 19న బెయిల్ మంజూరు చేసింది. కాగా రాఖీ యాదవ్‌కు పట్నా హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయటాన్ని సవాల్ చేస్తూ బిహార్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.

మరిన్ని వార్తలు