233 మంది ఎంపీలపై క్రిమినల్‌ కేసులు

27 May, 2019 11:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 539 మంది అభ్యర్ధుల్లో 43 శాతం అంటే 233 మంది ఎంపీలపై నేరాభియోగాలు ఉన్నాయని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) తెలిపింది. గత లోక్‌సభతో పోలిస్తే నేరారోపణలు ఉన్నవారి సంఖ్య 26 శాతం అధికం కావడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల్లో విజేతలైన 539 మంది అభ్యర్ధుల అఫిడవిట్లను విశ్లేషించిన ఏడీఆర్‌ బీజేపీ నుంచి ఎన్నికైన వారిలో 116 మంది ఎంపీలపై (39 శాతం) క్రిమినల్‌ కేసులు ఉన్నాయని తెలిపింది.

కాంగ్రెస్‌ నుంచి ఎన్నికైన వారిలో 29 మంది ఎంపీలపై (57 శాతం) క్రిమినల్‌ కేసులున్నాయి. ఇక 13 మంది జేడీ(యూ) ఎంపీలపై,  10 మంది డీఎంకే ఎంపీలపై. తొమ్మిది మంది తృణమూల్‌ ఎంపీలపై క్రిమనల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. నూతన లోక్‌సభలో 29 శాతం కేసులు లైంగిక దాడి, హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాల వంటి కేసులు ఉన్నాయని వెల్లడించింది. 2009 నుంచి తీవ్ర నేరాలు నమోదయ్యాయని వెల్లడించిన ఎంపీల సంఖ్య రెట్టింపైందని ఏడీఆర్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు