మా రాష్ట్రంలో కరోనా లేదు: సీఎం

20 Apr, 2020 20:57 IST|Sakshi
ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌

ఇంఫాల్‌: గోవా తర్వాత మరో రాష్ట్రం కరోనా మహమ్మారి నుంచి బయటపడింది. తమ రాష్ట్రంలో ఒక్క కోవిడ్‌-19 కేసు లేదని గోవా ప్రకటించిన మరుసటి రోజే మణిపూర్‌ కూడా ఇదే ప్రకటన చేసింది. తమ రాష్ట్రంలో కోవిడ్‌ సోకిన ఇద్దరు బాధితులు పూర్తిగా కోలుకున్నారని, వారికి నిర్వహించిన కరోనా వైరస్‌ నిర్ధారిత పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిందని మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బీరేన్‌ సింగ్‌ ప్రకటించారు.

‘మణిపూర్‌ ఇప్పుడు కరోనా లేని రాష్ట్రమని ప్రకటించడానికి సంతోషిస్తున్నా. కోవిడ్‌ బాధితులిద్దరూ పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులేవీ నమోదు కాలేదు. ప్రజలు, వైద్య సిబ్బంది సహకారం, లాక్‌డౌన్‌ కారణంగానే ఇది సాధ్యమయింద’ని బీరేన్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను సడలించాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. ఇంఫాల్‌లో మాత్రం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో అత్యవసర వస్తువుల దుకాణాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరుచుకోవచ్చని తెలిపారు.

కాగా, కరోనా లేని మొదటి రాష్ట్రంగా గోవా నిలిచింది. ఇక్కడ కోవిడ్‌ బారిన పడ్డ ఏడుగురు పూర్తిగా కోలుకోవడం, కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోవడంతో గోవా గ్రీన్‌జోన్‌లోకి వెళ్లింది. పాజిటివ్‌ కేసులు లేకపోయినప్పటికీ లాక్‌డౌన్‌ కొనసాగిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్‌ ప్రమోద్‌ సావంత్‌ స్పష్టం చేశారు. 

చదవండి: హమ్మయ్య.. వారికి కరోనా నెగెటివ్‌ 

మరిన్ని వార్తలు