ఓటమి షాక్‌తో ఆహారం ముట్టని దిగ్గజ నేత..

26 May, 2019 13:44 IST|Sakshi

రాంచీ : లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఒక్క సీటు కూడా ఆర్జేడీ దక్కించుకోకపోవడంతో ఆ పార్టీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తీవ్ర మనస్ధాపానికి లోనయ్యారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన ఆహారం తీసుకోవడం లేదని రాంచీలోని రిమ్స్‌లో లాలూకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన దినచర్య గాడితప్పిందని వారు తెలిపారు. పశుగ్రాస కుంభకోణంలో లాలూ ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచిలాలూ ఆహారం సరిగ్గా తీసుకోవడం లేదని ఆయనను పర్యవేక్షించే వైద్యుడు ఉమేష్‌ ప్రసాద్‌ చెప్పారు. మందులు, ఇన్సులిన్‌ ఇచ్చేందుకు సహకరిస్తూ ఆయనను ఆహారం సవ్యంగా తీసుకోవాలని తాము కోరుతున్నామని అన్నారు.బిహార్‌లో కాంగ్రెస్‌-ఆర్జేడి కూటమిగా ఎన్డీయేను ఎదుర్కోగా కాంగ్రెస్‌కు కేవలం ఒక స్ధానం దక్కగా, ఆర్జేడీ ఒక్క స్ధానంలోనూ గెలుపొందలేదు. 

రాష్ట్రంలోని 40 స్ధానాలకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 39 స్ధానాలను గెలుచుకుని క్లీన్‌స్వీప్‌ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రణాళికలు రూపొందించుకోవచ్చని లాలూకు ఆర్జేడీ నేతలు సర్ధిచెబుతున్నా ఆర్జేడీ చీఫ్‌ మాత్రం ఫలితాల షాక్‌ నుంచి ఇంకా తేరుకోలేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు