న్యూఢిల్లీ: 'స్నాప్డీల్' ఉద్యోగిని దీప్తి సర్నా కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమై వారం రోజులు గడువకముందే దేశ రాజధాని న్యూఢిల్లీ శివార్లలో మరో మహిళ అదృశ్యమైంది. నోయిడాకు చెందిన షిప్రా మాలిక్ అనుమానాస్పద పరిస్థితుల్లో నడుమ కనిపించకుండాపోయారు.
వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్ అయిన ఆమె సోమవారం ఇంటి నుంచి చాందిన్చౌక్కు బయలుదేరారు. ఆమె మొబైల్ఫోన్ నుంచి చివరి కాల్ '100'కు చేసినట్టు కనిపిస్తోంది. చివరిసారిగా పోలీసులకు ఫోన్ చేసినప్పుడు.. ఆమె దక్షిణ ఢిల్లీలోని లజ్పత్ నగర్లో ఉన్నట్టు లోకేషన్ను గుర్తించారు. ఆమె ఇంటికి 500 మీటర్ల దూరంలో ఆమె మారుతి స్విఫ్ట్ కారు వదిలేసి ఉంది.
నోయిడాలో 'బోటిక్' నడిపిస్తున్న ఆమె స్థానిక బిల్డర్ను వివాహం చేసుకుంది. షిప్రా కనిపించకపోవడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆమె కిడ్నాప్ అయిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎవరి నుంచి డబ్బు కోసం కుటుంబసభ్యులకు ఇప్పటివరకు ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదు.