ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చొద్దు

28 Jul, 2018 03:41 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అత్యచార నిరోధక చట్టాన్ని నీరుగార్చొద్దని లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) ఎంపీ రాం విలాస్‌ పాశ్వాన్‌ కోరారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగమవుతోందని, దాన్ని పునఃపరిశీలించాలంటూ మార్చి 20న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా కేంద్రం వెంటనే ఆర్డినెన్స్‌ తీసుకు రాకుంటే తాము ఉద్యమబాట పడతామన్నారు. ఆగస్టు 9లోగా జాతీయ హరిత ట్రిబ్యునల్‌ చైర్మన్‌ ఆదర్శ్‌ గోయెల్‌ను తొలగించాలన్నారు.

ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రయోజనాలను కాపాడుతారనే 2014లో బీజేపీకి మద్దతిచ్చామని పాశ్వాన్‌ అన్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పునరుద్ధరించి యథావిధిగా అమలు చేయాలన్నారు. ఆగస్టు 9లోగా తమ డిమాండ్లను గనుక కేంద్రం నెరవేర్చకపోతే ఎన్డీయే నుంచి వైదొలగుతామన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చొద్దని కోరుతూ దేశవ్యాప్తంగా దళిత, గిరిజన సంఘాలు దేశవ్యాప్తంగా ఆగస్టు 10న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి.

మరిన్ని వార్తలు