చనిపోతే బతికించారు.. మళ్లీ ‘చంపేశారు’!!

31 May, 2020 21:30 IST|Sakshi
భిసికర్‌ మృతదేహం

అహ్మదాబాద్‌: కోవిడ్‌ నియంత్రణలో గుజరాత్‌ ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో.. అక్కడి ప్రభుత్వ దవాఖానాల పేలవ పనితీరుకు అద్దం పట్టే ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా అహ్మదాబాద్‌ ప్రభుత్వాస్పత్రి నిర్వాకమొటి బయటపడింది. చనిపోయిన కోవిడ్‌ బాధితుడు బతికే ఉన్నాడని చెప్పిన ఆస్పత్రి యాజమాన్యం.. మరోసారి అతను చనిపోయినట్టు చెప్పి పరువు తీసుకుంది. ఇంతకీ తమ ఆత్మీయుడు బతికి ఉన్నాడా? చనిపోయాడా? అనే సందిగ్దంలో ఆ కుటుంబం పడిపోయింది.

వివరాలు.. దేవ్‌రామ్‌భాయ్‌ భిసికర్‌కు కరోనా లక్షణాలు బయటపడటంతో మే 28న అహ్మదాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. మే 29 అతను మరణించినట్టు చెప్పిన ఆస్పత్రి యాజమాన్యం.. కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించింది. ఇక కేంద్ర మార్గదర్శకాలను అనుసరించిన భిసికర్‌ కుటుంబ సభ్యులు.. ఆస్పత్రి అప్పగించిన మృతదేహాన్ని అలాగే తీసుకెళ్లి దహనం చేశారు. అయితే, భిసికర్‌ వైద్యానికి స్పందిస్తున్నారని మే 30 వ తేదీన అదే‌ ఆస్పత్రి నుంచి భిసికర్‌ కుటుంబ సభ్యులకు ఫోన్‌ కాల్‌ వచ్చింది.
(చదవండి: 25 రోజుల్లో 376 అంత్యక్రియలు!)

దీంతో అయోమయంలో పడిపోయిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి కాల్‌ చేయగా.. ‘పొరపాటుగా మీకు కాల్‌ వచ్చింది. భిసికర్‌ చనిపోయి ఉండొచ్చు’అనే సమాధానం ఇచ్చారు. ఇక రెండోసారి కాల్‌ చేయగా.. భిసికర్‌ కోవిడ్‌ రిపోర్టులు నెగటివ్‌ వచ్చాయి. అతను కోలుకుంటున్నాడని చెప్పారు. దీంతో భిసికర్‌ కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యాన్ని సంప్రదించగా.. డాక్టర్‌ శషాంక్‌ జే పాండ్యా మాట్లాడుతూ.. షుగర్‌ లెవల్స్‌ పెరిగిపోడంతో భిసికర్‌ చనిపోయాడని చెప్పారు. అయితే, కోవిడ్‌ రిపోర్టులు రావడం ఆలస్యం కావడంతో ఆయన మృతదేహాన్నికుటుంబ సభ్యులు చూడలేకపోయారని చెప్పుకొచ్చారు. భిసికర్‌కు కోవిడ్‌ ఉన్నట్టు తేలిందని వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు