రానున్న లోకసభ ఎన్నికల్లో కలిసి పోటి చేసేందుకు అధికార ఏఐఏడీఎంకే పార్టీ, సీపీఐ పార్టీల మధ్య పొత్తు ఖారారైంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని గద్దె దింపి లౌకిక, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా అడుగులేసేందుకు జయలలిత నాయకత్వంలోని అన్నాడీఎంకే(ఏఐఏడీఎంకే), సీపీఐ పార్టీల పొత్తు కుదుర్చుకున్నాయి. జయ నివాసం పోయెస్ గార్డన్ లో జరిగిన సమావేశంలో సీపీఐ నాయకులు ఏబీ బర్ధన్, సుధాకర్ రెడ్డి లు పాల్గొన్నారు.
సమావేశానంతరం బర్ధన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇరు పార్టీల పొత్తు విజయాన్ని అందిస్తుంది. మేము ఖచ్చితంగా గెలుపు సాధిస్తాం అని అన్నారు. ఒకవేళ మేము ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తే.. జయలలిత ప్రధాని పదవికి రేసులో ఉంటుంది అని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అయితే ఈ చర్చలో మధ్య జోక్యం కలిగించుకుని.. అవన్ని ఎన్నికల ఫలితాల తర్వాతే చర్చకు వస్తాయని జయలలిత అన్నారు. ప్రస్తుతం తమ దృష్టంతా తమిళనాడు, పాండిచ్చేరి లోని 40 లోకసభ స్థానాలను గెలుచుకోవడంపైనే ఉంది అని జయ వ్యాఖ్యానించారు. శాంతి, ప్రగతి అనే నినాదంతో ఎన్నికలకు వెళ్తాం అని అన్నారు.