శుభశ్రీ కేసులో మలుపు.. అన్నాడీఎంకే నేత అరెస్ట్‌

28 Sep, 2019 15:40 IST|Sakshi

అన్నాడీఎంకే నేత జయగోపాల్‌ అరెస్టు

సాక్షి, చెన్నై: బ్యానర్‌ కూలి శుభశ్రీ మృతిచెందిన కేసులో అన్నాడీఎంకే నేత జయగోపాల్‌ను శుక్రవారం పోలీసులు కృష్ణగిరిలో అరెస్టు చేశారు. క్రోంపేట నెమిలిచ్చేరికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు శుభశ్రీ ఇటీవల స్కూటర్‌లో వెళుతుండగా బ్యానర్‌ కూలిపడడంతో వెనుక వచ్చిన లారీ ఢీకొని మృతిచెందిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సెయింట్‌థామస్‌మౌంట్‌ ట్రాఫిక్‌ పోలీసులు విచారణ జరుపుతూ వచ్చారు. దీనికి సంబంధించి అన్నాడీఎంకే నేత జయగోపాల్, అతని బావమరిది మేఘనాథన్‌పైన సెయింట్‌థామస్‌మౌంట్‌ ట్రా ఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న జయగోపాల్‌ కోసం ఐదు పోలీసు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి గాలింపులు జరిపారు. జయగోపాల్, అతని బంధువులు ఇళ్లకు తాళాలు వేసి పరారీలో ఉన్నారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా జయగోపా ల్‌ ఇంటికి పోలీసులు నోటీసులు అతికించారు. అతని బంధువులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. జయగోపాల్‌ ధర్మపురి జిల్లా హొగెనేకల్‌ ప్రాంతంలో దాగివుండొచ్చని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడ తీవ్రంగా గాలింపులు జరిపారు.

జయగోపాల్‌ అరెస్టు
శుభశ్రీ కేసులో నిందితుడు అన్నాడీఎంకే నేత జయగోపాల్‌ను ఎట్టకేలకు పోలీసులు కృష్ణగిరిలో శుక్రవారం అరెస్టు చేసి చెన్నైకు తీసుకువచ్చారు. గత 14 రోజుల అనంతరం అతను పట్టుబడ్డాడు. అతన్ని న్యాయస్తానంలో హాజరుపరిచి జైలులో నిర్బంధించనున్నారు. అనంతరం శనివారం మధ్యాహ్నాం అతను బెయిల్‌ మీద విడుదలయ్యారు.

విచారణకు ప్రత్యేక అధికారులు
బ్యానర్‌ కూలిపడి శుభశ్రీ మృతిచెందిన వ్యవహారం గురించి ఇంజినీర్‌ వద్ద విచారణ జరిపేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. తర్వాత విచారణ నివేదికను నగర కార్పొరేషన్‌ కమిషనర్‌కు అందజేయనున్నారు. నేరం నిరూపించబడితే సస్పెన్షన్, వేతన పెంపు రద్దు, గరిష్టంగా ఉద్యోగం నుంచి డిస్మిస్‌ కూడా చేయవచ్చని అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు