ఏఐఏడీఎంకే నేత దారుణ హత్య

12 Feb, 2017 16:02 IST|Sakshi
ఏఐఏడీఎంకే నేత దారుణ హత్య

చెన్నై:
ఏఐఏడీఎంకేలో శశికళ వర్గానికి చెందిన ఓ నేతను ముగ్గురు వ్యక్తులు అత్యంత పాశవికంగా అందరూ చూస్తుండగానే హత్య చేశారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ హత్యకు సంబంధించి వీడియోను పోలీసులు విడుదల చేశారు. తిరువన్నామలై జిల్లాలో జరిగిన ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా కలకలం రేపింది. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన తిరువన్నామలై నగర మాజీ సెక్రటరీ, ప్రస్తుత మున్సిపల్ కౌన్సిలర్ వి.కనకరాజ్‌(40)ను ప్రత్యర్థులు నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు. కనకరాజ్‌ మృతిపట్ల ఏఐఏడీఎంకే అధ్యక్షురాలు శశికళ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీలో రికార్డయ్యింది. విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. అనంతరం అక్కడ సీసీటీవీని పరిశీలించగా హత్య దృశ్యాలు కనిపించాయి. హత్య చేసింది తామే అంటూ ముగ్గురు నిందితులు (డీఎంకేకు చెందిన కార్యకర్తలు)  బాబు(28), రాజా(35), శరవణన్‌(30) పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. ఆర్థిక పరమైన అంశాల్లో తేడా రావడంతోనే నిందితులు హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.