మృతదేహంలో కరోనా ఎంతకాలం ఉంటుంది?

23 May, 2020 05:20 IST|Sakshi

కోవిడ్‌–19 బాధిత వ్యక్తి మృతదేహానికి పోస్టుమార్టం చేసే యోచనలో ఎయిమ్స్‌

న్యూఢిల్లీ: మొదటిసారిగా కోవిడ్‌–19 బాధిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. మృతుల శరీరాల్లో కరోనా వైరస్‌ ఎంత కాలం జీవిస్తుంది? మృతదేహం నుంచి కూడా ఆ వైరస్‌ ఇతరులకు సోకుతుందా? శరీరంలోని ఏఏ అవయవాలపై ఏ మేరకు ప్రభావం చూపుతోంది? అనే విషయాలను ఈ పోస్టుమార్టం ద్వారా పరిశీలించనుంది. ఈ అధ్యయనంలో పాథాలజీ, మైక్రో బయాలజీ విభాగాల నిపుణుల సాయం కూడా తీసుకోనున్నట్లు ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ చీఫ్‌ డాక్టర్‌ సుధీర్‌ గుప్తా వెల్లడించారు.

‘ఇప్పటి వరకు ఎవరూ ఇలాంటి ప్రయత్నం చేయలేదు. అందుకే దీనికోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కరోనా వైరస్‌ మనిషి శరీరంలోకి వెళ్లాక ఏఏ అవయవాలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది. మృత శరీరంలో ఎంత కాలం జీవిస్తుంది? వంటి అంశాలు తెలుసుకునేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుంది’అని డాక్టర్‌ గుప్తా చెప్పారు. కోవిడ్‌ బాధిత మృతదేహాలకు పోస్టుమార్టం చేపట్టినట్లయితే  మార్చురీ సిబ్బందికి, పోలీసులకూ సోకడంతోపాటు మార్చురీ పరిసరాల్లోనూ వైరస్‌ ప్రభావం ఉంటుందని భావించిన ఐసీఎంఆర్‌.. శవపరీక్ష వద్దంటూ మార్గదర్శకాలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు