ఎయిర్ ఇండియాపై ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు

22 Mar, 2016 07:00 IST|Sakshi
ఎయిర్ ఇండియాపై ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు

♦ విధులు కేటాయించలేదని ఎస్టీ కమిషన్‌కు ఆవేదన
♦ 2008 నుంచి వేతనం ఇవ్వలేదని ఆందోళన
 
సాక్షి, న్యూఢిల్లీ: తనకు అకారణంగా ఎయిర్ హోస్టెస్‌గా విధులు కేటాయించకుండా  తీవ్ర మానసిక వేదనకు గురిచేశారని ఎయిర్ ఇండియా ఉద్యోగిని బి.ఝాన్సీరాణి సంబంధిత సంస్థపై జాతీయ ఎస్టీ కమిషన్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా.. ‘నేను షెడ్యూలు తెగకు చెందిన కోయ సామాజిక వర్గానికి చెందిన మహిళను. భద్రాచలం ఏజెన్సీ నుంచి వచ్చి ప్రస్తుతం సికింద్రాబాద్‌లో నివసిస్తున్నా. నేను ఎయిర్‌ఇండియాలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేశా. దాదాపు 27 ఏళ్ల పాటు పనిచేసిన నాకు ఎయిర్ హోస్టెస్‌గా విధులు కేటాయించడం మానేశారు.

2008 నుంచి నాకు ఇప్పటి వరకు వేతనం చెల్లించలేదు. వైద్య ప్రయోజనాలు కల్పించలేదు. ఇప్పటివరకు అటు పీఎఫ్ గానీ, గ్రాట్యుటీ చెల్లింపు విషయంగానీ తేల్చలేదు. నాపై ఆధారపడిన నా ఇద్దరు కూతుళ్లకు నేను చదువుకునేందుకు డబ్బులు చెల్లించలేకపోతున్నా. ఇప్పటివరకు నా కుటుంబాన్ని పోషించుకునేందుకు నానాకష్టాలు పడ్డా. ఈ వయసులో నేను కొత్తగా ఉద్యోగాన్ని పొందలేక పోతున్నా. అందువల్ల నాకు రావాల్సిన వేతనం ఇప్పించాలని వేడుకుంటున్నా. నన్ను ఇన్నాళ్లు వేధించినందుకు నాకు పరిహారం ఇప్పించాలని కోరుకుంటున్నా. నా తోటి ఉద్యోగులకు ఇచ్చిన తరహాలో అన్ని రకాల పదోన్నతులతో సహా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నా. నాకు, నాకుటుంబానికి మనోవేదన కలిగించినందుకు రూ. 5 కోట్ల పరిహారం ఇప్పించాలని ప్రార్థిస్తున్నా.. ’ అని ఆమె తన ఫిర్యాదులో ఎస్టీ కమిషన్‌కు వేడుకున్నారు.

మరిన్ని వార్తలు