లుథియానా: పంజాబ్ ఎన్నికల్లో వాగ్దానాలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. తిరిగి తమకు అధికారంలో కట్టబెడితే చాలు.. చాంతాడంత మేలు చేస్తామంటూ ఇప్పటికే వివిధ ఎన్నికల ప్రచారాల్లో చెబుతున్న శిరోమణి అకాళీదల్(ఎస్ఏడీ) తాజాగా తన మేనిఫెస్టోలో పెద్ద శుభవార్తను తెలియజేసింది. అమెరికాలో, కెనడాలో దాదాపు ఒక లక్ష ఎకరాలను కొనుగోలు చేస్తామని, అక్కడకు వెళ్లి సెటిల్ అయ్యే పంజాబీలకు ఆ భూమిని ఉపయోగిస్తామని తెలిపారు.
మిగతా వాగ్ధానాల సంగతి ఎట్లున్నా ఈ ప్రకటన మాత్రం ఇతర పార్టీలకు మాత్రం కాస్తంత గుబులుపుట్టించేందిగానే ఉంది. బుధవారం పంజాబ్ ఉపముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ ఎన్నికల మేనిఫెస్టోను లుథియానాలో విడుదల చేశారు. దీని ప్రకారం అమెరికా, కెనడా వంటి దేశాలకు వలస వెళ్లి అక్కడ ప్రొఫెషనల్ రైతులుగా మారేందుకు ముందుకొచ్చేవారికి తాము లక్ష ఎకరాలు తీసుకొని అందులో కేటాయింపులు చేస్తామని తెలిపారు. అయితే, ఈ ప్రకటన అయితే చేసిందిగానీ, దీనికి ఎవరు అర్హులు? ఎలా దీనిని పొందవచ్చు అనే వివరాలు మాత్రం తెలియజేయలేదు.