రవిశంకర్‌ మధ్యవర్తిత్వం అక్కర్లేదు: ఒవైసీ

13 Nov, 2017 16:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య వివాదాస్పద స్థల అంశంపై ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. మధ్యవర్తిగా వ్యవహరించబోతున్న రవిశంకర్‌పై తీవ్రస్థాయిలో ఒవైసీ మండిపడ్డారు. అయోధ్య వివాదంలో ఆయన దౌత్యం అక్కర్లేదని ఆయన చెబుతున్నారు.

‘‘రవిశంకర్‌ మధ్యవర్తిత్వాన్ని మేం అంగీకరించబోం. ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అలాంటి ప్రతిపాదనలకు అంగీకరించబోమని గతంలోనే స్పష్టం చేసింది. అలాంటప్పుడు ఆయన్ని(రవిశంకర్‌) ఎలా నియమిస్తారు’’ అని ఒవైసీ మండిపడ్డారు. అనవసరంగా ఈ అంశాన్ని రాజకీయం చేయాలని కొందరు యత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. కాగా, నిర్మోహి అఖాదా, ఏఐఎంపీఎల్‌బీ అయోధ్య వివాదంలో మధ్యవర్తిత్వం వహించాలంటూ ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ పండిట్‌ రవిశంకర్‌ను సంప్రదించిన విషయం తెలిసిందే.

అందుకు సుముఖత వ్యక్తం చేసిన ఆయన ఈ నెల 16న అయోధ్యలో పర్యటించనున్నారు. తనకు వ్యక్తిగత ఎజెండా అంటూ ఏం లేదని.. చర్చలే అన్ని సమస్యలకు పరిష్కారమని రవిశంకర్‌ ఇది వరకే స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కోసం అందరితో సంప్రదింపులు చేపడతానని ఆయన పేర్కొన్నారు కూడా. ఇక చర్చలకు రవిశంకర్‌ను ఆహ్వానిస్తూ సీఎం యోగి ఓ ప్రకటన చేశారు. దేశం ఒక్కటిగా ఉండాలని రవిశంకర్‌ కొరుకుంటున్నారు. రెండు వర్గాలు అంగీకరిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని అని యోగి ఆ ప్రకటనలో తెలిపారు. 
 

మరిన్ని వార్తలు