ప్లాస్టిక్‌ వ్యర్థాలే స్కూలు ఫీజు

6 Jun, 2019 03:58 IST|Sakshi

ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని తగ్గించేందుకు అస్సాం దిస్‌పూర్‌లోని అక్షర్‌ ఫోరం స్కూలు వినూత్న పథకాన్ని ప్రారంభించింది. తమ స్కూలు విద్యార్థులు ఫీజుకు బదులు ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఇవ్వాలని ఆదేశించింది. ప్రతి విద్యార్థి ప్రతీవారం కనీసం 20 పనికిరాని ప్లాస్టిక్‌ వస్తువులు తెచ్చివ్వాలని, అలా తెస్తే వారికి ఉచితంగా చదువు చెప్తామని ప్రకటించింది. దీంతో విద్యార్థులు తమ ఇళ్లు లేదా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను తెచ్చి స్కూల్లో ఇస్తున్నారు. కిందటేడాది వరకు ఈ స్కూల్లో ఉచితంగానే చదువు చెప్పేవారు.

అయితే, ఈ సంవత్సరం నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలు తెస్తేనే ఉచితంగా చదువు చెబుతామని స్కూలు యాజమాన్యం స్పష్టం చేసింది. పిల్లల నుంచి సేకరించిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైకిలింగ్‌ చేసి ఉపయోగిస్తున్నట్టు స్కూలు యాజమాన్యం తెలిపింది. విద్యార్థుల చేత ప్లాస్టిక్‌ సీసాల్లో ప్లాస్టిక్‌ కవర్లను నింపిస్తున్నారు. దాంతో అవి పర్యావరణానుకూల ఇటుకలుగా(ఎకో బ్రిక్స్‌) తయారవుతున్నాయి. ఇలా చేసినందుకు విద్యార్థులకు కొంత సొమ్ము కూడా చెల్లిస్తున్నారు. ఈ ప్లాస్టిక్‌ ఇటుకలతో స్కూలు భవనాలు, మరుగుదొడ్లు, ఫుట్‌పాత్‌లు నిర్మిస్తున్నారు.

మరిన్ని వార్తలు