భారత్‌కు ఉగ్రదాడి హెచ్చరికలు..!

5 Jun, 2019 10:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో భారీ ఉగ్రదాడికి పాల్పడేందుకు ఆల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్లు భారత నిఘావర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాద సంస్థలపై గత కొంత కాలం నుంచి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రతీకారంగా ఆత్మహుతి దాడికి పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు భద్రతాదళాల సమాచారం. పాక్‌ సరిహద్దులోని పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై 2016లో భారీ ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అలాంటి దాడికి ఆల్‌ఖైదా వ్యూహాలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. పాక్‌ ప్రేరేపిత సంస్థ జైషే మహ్మద్‌ చర్యలను భారత్‌ ఇటీవల తిప్పికొట్టిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో భారత్‌పై ప్రతీకారం తీర్చుకేనేందుకు ఆల్‌ఖైదాకు జైషే మహ్మద్‌ సహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతా బలగాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌ చేసింది. సరిహద్దు వెంబడి పహారాను పటిష్టంచేసింది. కాగా నేడు దేశ వ్యాప్తంగా రంజాన్‌ పర్వదినం కావడంతో మసీదుల వద్ద భారీ బందోబస్తులను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు