కాంగ్రెస్‌ గూటికి ఆప్‌ ఎమ్మెల్యే..

3 Sep, 2019 13:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆప్‌ రెబల్‌ ఎమ్మెల్యే అల్కా లాంబా కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. గత కొద్దినెలలుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న అల్కా లాంబా కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక చీఫ్‌ సోనియా గాంధీతో మంగళవారం భేటీ అయ్యారు. సోనియాను ఆమె నివాసంలో కలిసిన అల్కా కాంగ్రెస్‌ అధినేత్రితో సంప్రదింపులు జరిపారు. 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశం జరగడంతో అల్కా లాంబా కాంగ్రెస్‌ గూటికి చేరడం ఖాయమని భావిస్తున్నారు. కాగా చాందినిచౌక్‌ నుంచి ఆప్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన అల్కా తాను పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానని, రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగుతానని ఆమె ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆమె రాజీనామాను ఆమోదించేందుకు సంసిద్ధమని ఆప్‌ కూడా వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్‌ పరాజయానికి బాధ్యత తీసుకోవాలని పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఆమె బాహాటంగా కోరడంతో పార్టీ ఎమ్మెల్యేల అధికారిక వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి అల్కాను తొలగించారు.

మరిన్ని వార్తలు