లక్నో : ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మదర్సాలో చదివే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూనిఫాం దరించాలని యూపీ సీఎం అదిత్యానాథ్ ఆదేశాలు జారిచేశారు. మదర్సా ప్రతినిధులందరితో చర్చించిన తరువాత యూనిఫాం కోడ్ పెట్టాలని నిర్ణయించినట్లు రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి మొహ్సిన్ రజా తెలిపారు. ఈ నిర్ణయంపై అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని, యూనిఫాం కోడ్ వల్ల విద్యార్ధుల్లో అందరూ సమానమన్న భావం ఏర్పాడుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని మదర్సా పాఠశాలో విద్యార్థులందరూ కుర్తా-ఫైజామా దరించి పాఠశాలకు రావాలని, యూనిఫాం ప్రభుత్వమే అందిస్తుందని మొహ్సిన్ రజా వెల్లడించారు.
యూపీ సీఎంగా యోగి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మదర్సా పాఠశాల్లో పలు కీలక సంస్కరణలు చేపడుతున్నారు. రాష్ట్రంలోని మదర్సా పాఠశాలలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యూకేషన్ రీసెర్చ్, ట్రైనింగ్ (ఎన్సీఆర్టీ) సిలబస్ను ప్రవేశపెట్టాలని 2017లో సీఎం యోగి ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. మదర్సా పాఠశాలలు ప్రతి ఏడాది ఆగస్ట్ 15న జెండా ఎగరవేయాలని 2017లో యూపీ ప్రభుత్వం ఆదేశించడంతో.. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మదర్సాలు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.