సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల 16 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవనున్న నేపథ్యంలో 15న అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు జీఎస్టీ బిల్లులుసహా పలు బిల్లుల ఆమోదానికి ప్రతిపక్షాల సహకారం కోరేందుకు ప్రభుత్వం ఈ సమావేశం ఏర్పాటుచేస్తోంది. ప్రధానిసహా ప్రధాన పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు.
రూ.500, రూ.1000 నోట్ల రద్దు, సైన్యం సర్జికల్ దాడులు, ఏపీకి ప్రత్యేక హోదా, ట్రిపుల్ తలాఖ్ అంశాలపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు సిద్దమవుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్న డిమాండ్తో సమావేశాలను స్తంభింపజేసేందుకు వైఎస్సార్సీపీ ఎంపీలు సిద్ధమవుతున్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం, పోలవరం అంశాలపై ఏపీ ఎంపీలు పట్టుబట్టే వీలుంది.