కరోనా.. కేంద్రం మరో కీలక నిర్ణయం

22 Mar, 2020 14:26 IST|Sakshi

మార్చి 31 వరకు రైళ్లు రద్దు

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ పాజిటివ్‌ కోసుల సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31వరకు అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. గూడ్స్‌ రైళ్లను యథావిథిగా నడపనున్నట్టు తెలిపింది. ఇప్పటికే ప్రారంభమైన రైళ్లు మాత్రం గమ్యస్థానాలకు చేరుకునే వరకు అనుమతించినట్టు పేర్కొంది.  అయితే కొన్ని సబ్‌అర్బన్‌, కోల్‌కత్తా మెట్రో రైలు సర్వీసులు మాత్రం మార్చి 22 అర్ధరాత్రి వరకు కొనసాగుతాయని ప్రకటించింది. ఆ తర్వాత వాటిని కూడా మార్చి 31 వరకు నిలిపివేస్తున్నట్టు తెలిపింది. 

ఇప్పటికే జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం రోజున దాదాపు 3,700 సర్వీసులను రైల్వే శాఖ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, భారత్‌లో​ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 341గా నమోదు కాగా, మృతుల సంఖ్య 6 కి చేరింది. మరోవైపు ప్రధాని పిలుపు మేరకు చేపట్టిన జనతా కర్ఫ్యూకు విశేషమైన స్పందన లభిస్తుంది. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ప్రధాన నగరాలన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు