అంత్యక్రియలు చేస్తుండగా.. కదిలిన బిడ్డ!

4 May, 2016 18:26 IST|Sakshi
అంత్యక్రియలు చేస్తుండగా.. కదిలిన బిడ్డ!

మంబై: ఈ బిడ్డ బతికే అవకాశం లేనే లేదని డాక్టర్లు చెప్పడంతో.. కొడుకు చనిపోయాడని అంత్యక్రియలకు తీసుకెళ్లిన తల్లిదండ్రులకు షాక్ తగిలింది. ఐదు నిమిషాల్లో మరణిస్తాడనుకున్న బిడ్డ మృత్యుంజయుడిగా బయటపడిన ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది.

మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన భాగ్య శ్రీ, నాగోజీ రావు దంపతులు కొన్నాళ్లుగా గుజరాత్‌లోని భరుచ్ ప్రాంతంలో ఉంటున్నారు. వాళ్లకు మూడు రోజుల కిందట పండంటి కొడుకు పుట్టాడు. బిడ్డ పుట్టుకతోనే శ్వాససంబంధ వ్యాధితో ఇబ్బంది పడుతుండటంతో సర్ సాయాజీరావు జనరల్ ఆసుపత్రి డాక్టర్లు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందించారు. బిడ్డ చికిత్సకు ఎంతకూ స్పందించకపోతుండటంతో వెంటిలేటర్ పై నుంచి తీసిన ఐదు నిమిషాల్లో మరణిస్తాడని తల్లిదండ్రులకు చెప్పారు.

దాంతో.. ఇక తమ కొడుకు చనిపోయాడని భావించిన ఆ తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించబోయారు. ఆ సమయంలో బిడ్డ కదలడం గమనించిన తండ్రి హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లాడు. దీంతో ఆశ్చర్యపోయిన వైద్యులు బిడ్డను మళ్లీ వెంటిలేటర్ మీద ఉంచారు. ఆ తర్వాత బిడ్డ చికిత్సకు క్రమంగా స్పందించడంతో వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా కనిపిస్తాయని.. బిడ్డ ఇప్పుడు సొంతంగా ఊపిరి తీసుకుంటున్నాడని డాక్టర్ పాండే తెలిపారు.

మరిన్ని వార్తలు