‘రాజకీయ వేశ్యలా వాడుకున్నారు’

20 Sep, 2017 17:35 IST|Sakshi
‘రాజకీయ వేశ్యలా వాడుకున్నారు’

సాక్షి, న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ మాజీ అధినేత ములాయం సింగ్‌ తనను ఒక రాజకీయ వేశ్యలా వాడుకునేందుకు ప్రయత్నించారంటూ.. అమర్‌ సింగ్‌ సంచలన ఆరోపణ చేశారు. చాలాకాలంగా క్రియాశీల రాజకీయాలకు, మీడియాకు దూరంగా ఉంటున్న అమర్‌సింగ్‌  తాజాగా ములాయంపై నిప్పులు చెరిగారు. కుటుంబంలో చిచ్చు రేగి అఖిలేశ్‌ యాదవ్‌ పార్టీ పగ్గాలు అందుకున్న సమయంలో ములాయం, రామ్‌గోపాల్‌ యాదవ్‌ ఎవరికీ తెలియకుండా నన్ను కలిసేందుకు ప్రయత్నించారని అమర్‌సింగ్‌ వెల్లడించారు.

ఒకదశలో అఖిలేశ్‌కు భయపడిన ములాయం, రామ్‌గోపాల్‌ యాదవ్‌లు రాత్రి సమయంలో దొడ్డిదారిగుండా.. వచ్చి కలుస్తామని చెప్పారన్నారు. అంతేకాక తమ మధ్య జరిగే సమావేశాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలని వారు కోరినట్లు అమర్‌సింగ్‌ తెలిపారు. ములాయంతో ఉంటే ఎటువంటి రాజకీయ భవిష్యత్‌ ఉండదని.. ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి మంగళవారం తన వద్ద వాపోయారని చెప్పారు. ఇదిలా ఉండగా.. తాను ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీలోనే కొనసాగుతున్నాని అమర్‌ సింగ్‌ ప్రకటించారు. అయితే పార్టీలో ఎటువంటి పాత్ర పోషించడం లేదని చెప్పారు. 

మరిన్ని వార్తలు