సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల వేతనం రెండింతలు 

30 Jan, 2018 19:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు, రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాలను రెండింతలు పైగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని నోటిఫై చేసింది. గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుత వేతనం రూ లక్ష నుంచి రూ 2.80 లక్షలకు పెరిగింది. ఇవి కాకుండా డీఏ, ఇతర అలవెన్సులు, అధికారిక నివాసం, కారు సిబ్బంది వంటి సౌకర్యాలు అదనం.

సుప్రీం కోర్టు ఇతర న్యాయమూర్తులు, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ల వేతనం ప్రస్తుతం ఉన్న రూ 90,000 నుంచి రూ 2.5 లక్షలకు పెరిగింది. క్యాబినెట్‌ కార్యదర్శి స్దాయిలో వీరికీ అలవెన్సులూ, ఇతర సౌకర్యాలు వర్తిస్తాయి. ప్రస్తుతం నెలకు రూ 80,000 వేతనం అందుకుంటున్న హైకోర్టు న్యాయమూర్తులకు పెరిగిన వేతనం రూ 2.25 లక్షలుగా ఖరారు చేశారు. జనవరి 1, 2016 నుంచి వేతన పెంపును అమలు చేస్తారు. సిట్టింగ్‌ జడ్జీలతో పాటు పదవీవిరమణ చేసిన న్యాయమూర్తులకూ వేతన పెంపు వర్తిస్తుంది. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు వేతనాలు పెంచాలని 2016లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు.

మరిన్ని వార్తలు