కరోనా: రేపు అమిత్‌ షాతో కేజ్రీవాల్‌ భేటీ

13 Jun, 2020 17:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తి విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం ఉదయం 11 గంటలకు హోం మంత్రి కార్యాలయంలో భేటీ కానున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ భేటీలో కరోనా వైరస్‌ కట్టడికి తీసుకోవల్సిన చర్యలు, ఆస్పత్రుల్లో బెడ్ల కొరత తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. (పరోటాపై అధిక పన్నులు.. కేం‍ద్రం క్లారిటీ!)

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌, ఎయిమ్స్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్ రణదీప్ గులేరియా, సీనియర్‌ డాక్టర్లు ఈ భేటీలో పాల్గొంటారు. ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసులు అధిక సంఖ్యలో పెరగటంతో పలు ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఢిల్లీలో మొత్తం 36824  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 22212 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 13398 మంది వైరస్‌ నుంచి కోలుకిని  డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా మృతుల సంఖ్య 1214కి చేరింది. (జనాలను భయపెట్టిన జిమ్‌ పరికరం)

మరిన్ని వార్తలు