నా లెక్క తప్పింది: అమిత్‌ షా

13 Feb, 2020 19:24 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరిస్తున్నామని కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తన అంచనా తప్పిందని వ్యాఖ్యానించారు. టైమ్స్‌ నౌ సమ్మిట్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ.. కొంతమంది బీజేపీ నేతల వ్యాఖ్యల కారణంగా ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ నష్టపోవాల్సి వచ్చిందని తెలిపారు. ‘‘దేశ్‌ కే గదరానోంకో గోలీమారో’’ (దేశ ద్రోహులను కాల్చండి) వంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. అదే విధంగా దేశ వ్యాప్తంగా నిరసనలకు కారణమైన పౌరసత్వ సవరణ చట‍్టం(సీఏఏ) గురించి ఎవరైనా తనతో చర్చకు రావొచ్చని అమిత్‌ షా తెలిపారు. ఇందుకు మూడు రోజుల సమయం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. (‘బేబీ మఫ్లర్‌మ్యాన్‌’కు ఆప్‌ బంపర్‌ ఆఫర్‌!)

కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉగ్రవాది అంటూ పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అదే విధంగా సీఏఏకు వ్యతిరేకంగా షాహిన్‌బాగ్‌లో నిరసనలు, ధర్నాలు జరగడం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే కేజ్రీవాల్‌ మాత్రం బీజేపీపై విమర్శలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా, వివాదాస్పద విషయాల జోలికి వెళ్లకుండా.. తాను అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రజలకు చేరువయ్యారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 11న వెలువడిన అసెంబ్లీ ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అఖండ విజయం సొంతం చేసుకోగా.. బీజేపీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు 62 సీట్లు ఆప్‌ గెలుచుకోగా.. బీజేపీ 8 స్థానాలతోనే సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.(ఆరోజే బిగ్‌ అనౌన్స్‌మెంట్‌: ప్రశాంత్‌ కిషోర్‌)

మరిన్ని వార్తలు