సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే కాంగ్రెస్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు ప్రధాని మోదీ చేపడుతున్న చర్యలను ప్రపంచమంతా కొనియాడుతోందని ఆయన ట్వీట్ చేశారు. దేశ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ప్రజలను తప్పుదారిపట్టించే చర్యలను కాంగ్రెస్ పార్టీ విరమించాలని హితవు పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రణాళికాబద్ధంగా దేశవ్యాప్త లాక్డౌన్ను అమలు చేయడం లేదని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆరోపించిన నేపథ్యంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో 130 కోట్ల మంది భారతీయులు కరోనాను ఓడించేందుకు పోరాడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ మాత్రం చవకబారు రాజకీయాలకు పాల్పడుతోందని అమిత్ షా దుయ్యబట్టారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 1965 కరోనా కేసులు నమోదవగా 50 మంది మరణించారు. 151 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు.