బాబా రాందేవ్‌తో అమిత్‌ షా భేటీ

4 Jun, 2018 16:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా సోమవారం యోగా గురు బాబా రాందేవ్‌తో భేటీ అయ్యారు. మోదీ సర్కార్‌ నాలుగేళ్ల పాలనలో సాధించిన విజయాలను ఈ సందర్భంగా రాందేవ్‌కు వివరించారు. పార్టీని విస్తృతంగా ప్రజలకు చేరువ చేసే క్రమంలో భాగంగా యోగా గురుతో అమిత్‌ షా సమావేశమయ్యారు. సంపర్క్‌ ఫర్‌ సమర్థన్‌ కార్యక్రమంలో భాగంగా తాను రాందేవ్‌ను కలిశానని, మోదీ సర్కార్‌ సాధించిన విజయాలను వివరించానని భేటీ అనంతరం షా ట్వీట్‌ చేశారు.

కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించేందుకు పార్టీకి చెందిన 4000 మంది కార్యకర్తలు వివిధ రంగాల్లో లబ్ధప్రతిష్టులైన లక్ష మందిని కలుస్తారని మే 26న ఈ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ బీజేపీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా అమిత్‌ షా ఇప్పటివరకూ 50 మందితో భేటీ అయ్యారని పార్టీ వర్గాలు తెలిపాయి.

మే 29న మాజీ ఆర్మీ చీఫ్‌ దల్బీర్‌ సింగ్‌ సుహాగ్‌, సుభాష్‌ కశ్యప్‌లను కలిశారు. అనంతరం క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌తో సమావేశమయ్యారు. పేదలు మెరుగైన జీవనం సాగించేలా, ప్రజల జీవన ప్రమణాలు పెంచేలా నాలుగేళ్ల హయాంలో తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ఆయా నేతలకు వివరిస్తామని అమిత్‌ షా చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు