‘చైనా సరిహద్దు వివాదంపై చర్చకు సిద్ధం’

28 Jun, 2020 20:54 IST|Sakshi

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీకి, కేంద్రానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాహుల్‌ గాంధీ తీరుపై మండిపడ్డారు. ఓ మీడియ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్‌ షా మాట్లాడుతూ.. భారత సరిహద్దు వివాదం ఉద్రిక్తతలపై 1962లో జరిగిన భారత్‌-చైనా యుద్ధం నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పార్లమెంట్‌లో చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కానీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సారంలేని(అనవసరపు)రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. (‘వారి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి’)

భారత్‌- చైనా సరిహద్దు వివాదంలో ప్రధాని నరేంద్రమోదీని విమర్శిస్తూ చేసిన హ్యాష్‌ ట్యాగ్‌ ‘సరెండర్‌ మోదీ’ ఆరోపణల వెనుక పాకిస్తాన్‌, చైనాల హస్తం ఉందని అమిత్‌ షా తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వంపై పనిగట్టుకొని చేస్తున్న వ్యతిరేక ఆరోపణలపై చర్చించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఒక వైపు కరోనా వైరస్‌ వ్యాప్తి, మరోవైపు చైనా సరిహద్దు ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ‌పార్టీ నీతిమాలిన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ భారత భూభాగాన్ని చైనా దురాక్రమణకు అప్పగించారంటూ రాహుల్‌ గాంధీ ఇటీవల ట్విటర్‌లో ఆరోపించిన విషయం తెలిసిందే.


 

మరిన్ని వార్తలు